||ప్రతీకాత్మక చిత్రం||
నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఏపీపీఎస్సీ గురువారం గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేయగా, తాజాగా గ్రూప్1 నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. గ్రూప్1లో మొత్తం 81 పోస్టుల భర్తీ కోసం గ్రూప్-1 నోటిఫికేషన్ను విడుదల చేసింది. మార్చి 17న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. జనవరి 1వ తేదీ నుంచి 21వ తేదీ వరకూ దరఖాస్తు స్వీకరించనున్నారు. గ్రూప్-1లో 6 డిప్యూటీ కలెక్టర్ పోస్టులు, 26 డీఎస్పీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది.
నిన్న గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 897 పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ఒక ప్రకటనలో పేర్కొంది. డిగ్రీ, ఆపై విద్యార్హత కలిగినవారు గ్రూప్-2 ఉద్యోగాలకు అర్హులు అని స్పష్టం చేసింది. మొత్తం పోస్టుల్లో 331 ఎగ్జిక్యూటివ్, 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయని వెల్లడించింది. అభ్యర్థులు ఈ నెల 21వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించింది.
ఈ ఉద్యోగాలకు ప్రిలిమినరీ పరీక్షను ఫిబ్రవరి 25న నిర్వహించనున్నట్టు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లో తెలిపింది. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థులను నిర్ణయించిన నిష్పత్తి ఆధారంగా మెయిన్ పరీక్షకు షార్ట్లిస్ట్ చేస్తామని, మెయిన్ పరీక్ష తేదీలను తర్వాత ప్రకటిస్తామని వెల్లడించింది. మెయిన్ రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా అభ్యర్థులకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష నిర్వహించనున్నట్లు వివరించింది. ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు రెండూ ఆబ్జెక్టివ్ విధానంలోనే జరుగుతాయని స్పష్టం చేసింది.