||కల్వకుంట్ల కవిత Photo: Twitter||
ఈవార్తలు, నేషనల్ న్యూస్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ తనకు సమన్లు జారీ చేయటాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన రిట్ పిటిషన్పై సుప్రీం కోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. గతంలో దాఖలు చేసిన నళినీ చిదంబరం పిటిషన్కు ఈ కేసును జోడిస్తూ కోర్టు కేసు విచారణకు మూడు వారాలకు వాయిదా వేసింది. అయితే, ఈడీ సమన్లపై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. కవిత, ఏపీ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి బినామీలు అరుణ్ రామచంద్ర పిళ్లై, ప్రేమ్ రాహుల్ సౌత్ గ్రూప్ ద్వారా ఆప్ నేతలకు రూ.100 కోట్ల ముందస్తు ముడుపులు చెల్లించి లిక్కర్ విధానాన్ని తమకు అనుకూలంగా ఉండేలా ప్రభావితం చేశారని ఈడీ వాదిస్తోంది.
దీనిపై ఇప్పటికే కవిత 3 సార్లు ఈడీ ముందు హాజరయ్యారు. అయితే, చట్టప్రకారం మహిళలను వారి ఇంటి దగ్గరే విచారించాల్సి ఉన్నా, ఈడీ కార్యాలయానికి పిలవడాన్ని సవాలు చేస్తూ కవిత ఈ నెల 14న సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసర పిటిషన్ దాఖలు చేసినా, సుప్రీం సీజేఐ అందుకు నిరాకరించారు. ఈ రోజు జస్టిస్ అజయ్రస్తోగి, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం ముందు లిస్ట్ చేయగా.. కోర్టు విచారణ చేపట్టింది. కవిత తరఫున కపిల్ సిబల్ వాదించారు. కాగా, మహిళలను ఈడీ ఆఫీస్కు పిలిచి విచారణ జరిపే విషయంలో గతంలో నళినీ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్కు తగ్గట్టు కవిత పిటిషన్ను దానికి జోడించారు.