జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేనా.. కేటీఆర్ ఓకే అన్నారట.. మరి కేసీఆర్ ఓకే అన్నట్టేనా?

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||అల్లం నారాయణ, తెలంగాణ సీఎం కేసీఆర్ Photo: Twitter ||

ఈవార్తలు, ఈముచ్చట: హైదరాబాద్ జర్నలిస్టులకు శుభవార్త.. అని ఒక వార్త వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతోంది. అదేనండోయ్.. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించి మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారన్నది దాని సారాంశం. టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్ ఆ మెసేజ్‌ చేసినట్టు తెలుస్తోంది. ఆ మెసేజ్ ప్రకారం.. ‘శుక్రవారం ప్రగతి భవన్‌లో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణతో కలిసి ఈ విషయమై మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. హైదరాబాద్‌లోని జర్నలిస్టుల సంఖ్య ఎంత? అర్హులైన జర్నలిస్టులు ఎంతమంది ఉన్నారు? అందరికీ ఇళ్లు కేటాయించడానికి ఎంత స్థలం అవసరం అవుతుంది? అన్న విషయాలను ఆరా తీశారు. దీంతోపాటు జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీకి సంబంధించిన స్థలాలను సభ్యులకు అప్పగించే విషయంపైనా చర్చ జరగగా మంత్రి సానుకూలత వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలోని అర్హులైన ప్రతి జర్నలిస్టుకు కూడా ఇళ్ల స్థలాలపై వారం పది రోజుల్లో పూర్తిస్థాయి స్పష్టత ఇచ్చే దిశగా చర్చలు జరిగాయి. నగరంలో పనిచేస్తున్న దాదాపు నాలుగు వేల మంది జర్నలిస్టులకు త్వరలో ఇళ్ల స్థలాల సమస్య పరిష్కార దిశగా ముందడుగు పడ్డట్లు అయ్యింది’ అని మారుతి సాగర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎన్నో ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న జర్నలిస్టులు ఈ మెసేజ్‌తో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు వరాలు కురిపిస్తున్న కేసీఆర్.. జర్నలిస్టులపై మాత్రం కనికరం చూపడం లేదన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇది కాస్త ఉపశమనం కలిగించింది. అయితే, గత కొన్నేళ్లుగా అధికార పార్టీ జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై మాట్లాడుతూనే ఉంది. అప్పట్లో సుప్రీం కోర్టు తీర్పు వచ్చాక, ఇక ఇళ్ల స్థలాల కాగితాలు చేతికి అందినట్లేనని సొసైటీ జర్నలిస్టులు భావించారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఇంచు కూడా ముందుకు తీసుకెళ్లలేదు. కేటీఆర్ కూడా అగో, ఇగో అని అన్నారు కానీ దానికి ముందడుగు పడలేదు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. అందుకే మళ్లీ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. సరే.. తెరపైకి తెచ్చినా, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు దక్కితే అంతకన్నా ఆనందం ఇంకోటి ఉండదు.

అయితే, ఆ మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్ జర్నలిస్టుల డేటా తెప్పించుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ, దానిపై ఎలాంటి గుసగుసలు వినిపించలేదు. గసగసాలు రుచించలేదు. ఏదో ఎన్నికలు కాబట్టి జర్నలిస్టులకు చిన్న ఆశ చూపి వదిలేద్దాం అని కేసీఆర్ అనుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. కేసీఆర్ ఓకే అని, జర్నలిస్టుల చేతికి ఇళ్ల స్థలాల కాగితాలు చేతికి అందితే అంతకన్నా ఆనందం ఇంకోటి ఉండదు. చూద్దాం వారం, పదిరోజుల్లో ఏ స్పష్టత వస్తుందో!

వెబ్ స్టోరీస్