మహేశ్వరంలో తీగల కృష్ణారెడ్డిని కట్టడి చేస్తున్న బీఆర్ఎస్.. నియోజకవర్గంపై ఆయన నీడపడకుండా..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో తీగల కృష్ణారెడ్డి||

(రంగారెడ్డి ఈవార్తలు, అక్కినేపల్లి పురుషోత్తంరావు)

మహేశ్వరం టిక్కెట్టు తనకే ఇవ్వాలని సవిత ఇంద్రారెడ్డికి ఇస్తే పార్టీ ఓడిపోవడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కిన మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి దూకుడుకు భారత రాష్ట్ర సమితి అధిష్టానం ఆయన కాళ్లకు బంధం వేసినట్టు కనిపిస్తోంది. ‘ఇబ్రహీంపట్నం అనే బంధాన్ని’ ఆయన కాళ్లకు వేసినట్టు అవగతం అవుతోంది. తీగల కృష్ణారెడ్డి వల్ల తన ప్రచారానికి ఇబ్బంది తప్పదని భావించిన సెట్టింగ్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఎన్నికలు ముగిసేంత వరకు మహేశ్వరంలో ఆయన నీడ పడకుండా చూడాలని పార్టీ పెద్దలను కోరినట్లు తెలిసింది. దీంతో అధిష్టానం ఆయనను బుజ్జగించినట్లు సమాచారం. చివరకు ఎమ్మెల్సీ హామీ ఇచ్చినట్లు తెలిసింది.

అంతేకాకుండా, ఎన్నికల్లో ఆయన సేవలు వినియోగించుకోవటానికి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎన్నికల ఇన్చార్జిగా కృష్ణారెడ్డిని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త బాధ్యతల నేపథ్యంలో ఆయన మహేశ్వరం నియోజకవర్గంలో తిరిగే అవకాశం లేకుండా పోయింది. 2018 ఎన్నికల్లో తనపై కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచిన సబితా ఇంద్రారెడ్డిని తనను సంప్రదించకుండానే పార్టీలో చేర్చుకున్నారని, ఏకంగా మంత్రి పదవిని సైతం కట్టబెట్టారని తీగల కృష్ణారెడ్డి ముందు నుంచీ అసంతృప్తిగానే ఉన్నారు. తన ఓటమికి కారణమైన సబితకు పార్టీలో పెద్దపీట వేయడం ఆయనకు మింగుడు పడలేదు. సబితా ఇంద్రారెడ్డికి వ్యతిరేకంగా ఉంటూ తరచూ ఘాటైన ఆరోపణలు విమర్శలతో వార్తలలో నిలుస్తున్నారు.

ఓ దశలో తీగల కృష్ణారెడ్డి భారత రాష్ట్ర సమితి పార్టీని విడాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరిగింది. ఏం జరిగిందో ఏమో కానీ ఆయన పార్టీని మాత్రం వీడలేదు. ఈ ఎన్నికలలో ఆయన కీలకంగా మారుతారని భావించారు. కానీ నియోజకవర్గంలో ఆయన నీడ పడకుండా కట్టడి చేశారని పార్టీ క్యాడర్ అభిప్రాయపడుతోంది.

వెబ్ స్టోరీస్