రైతు కూలీలకూ రైతుబంధు వర్తింపజేయొచ్చా? ఆ హామీని కాంగ్రెస్ ఎలా నెరవేర్చబోతోందంటే..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||ప్రతీకాత్మక చిత్రం Photo: Twitter||

రైతులకు రైతుబంధు ఇవ్వటం సాధ్యమే. ఎందుకంటే వాళ్ల పేరు మీదే భూమి ఉంటుంది కాబట్టి, ఎకరాకు ఇంత అని లెక్క కట్టి ఇవ్వొచ్చు. కానీ, రైతు కూలీలకు కూడా పెట్టుబడి సాయం ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఇదెలా సాధ్యం? అని చాలా మంది ప్రశ్నించారు. భూమి ఉంటే ఓ లెక్క అనేది ఉంటుంది. భూమి లేని కౌలు రైతులకు ఎలా వర్తింపజేస్తారు? అన్న ప్రశ్నే తలెత్తింది. అయితే, రైతు కూలీలకు కూడా పెట్టుబడి సాయాన్ని ఇవ్వొచ్చని కాంగ్రెస్ అంటోంది. అదెలా అంటే.. భూమి లేని వాళ్ల లెక్క తీస్తాం.. వాళ్లకు పెట్టుబడి సాయం ఇస్తాం.. అని స్పష్టం చేస్తోంది. భూమి లేని రైతు కూలీలకు ఏటా రూ.12 వేలు ఇస్తామని రాహుల్ గాంధీ ములుగు సభలో ప్రకటించారు.

అంటే.. రైతు కూలీలు, కౌలు రైతులు ఎన్ని ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారన్నదానితో సంబంధం లేకుండా ఏటా రూ.12 వేలు వాళ్ల అకౌంట్లలో పడతాయన్న మాట. వ్యవసాయం చేసే రైతు కూలీలను ఎలా లెక్కతీస్తారు? అన్న ప్రశ్న తలెత్తుతోంది. దీనికీ ఉపాధి హామీ కార్డును జత చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భూమి లేని, ఉపాధి హామీ కార్డు ఉన్న కూలీల లెక్క తీస్తే సరిపోతుందని కాంగ్రెస్‌లోని కొందరు విశ్లేషకులు వివరిస్తున్నారు.

భూమి ఉండీ, వ్యవసాయం చేయకుండా వదిలేసిన వందల ఎకరాల భూస్వాములకు కేసీఆర్ రైతుబంధు ఇస్తున్నపుడు.. ఇంచు భూమి కూడా లేని పేదలకు ఏటా పెట్టుబడి సాయం కింద రూ.12 వేలు ఇస్తే తప్పేంటని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. నిజమే.. వ్యవసాయం చేయకున్నా, వేల ఎకరాలు కూడబెట్టుకున్న ఎంతోమంది ఏటా రెండుసార్లు రైతుబంధును రూ.లక్షల్లో, రూ.కోట్లలో తీసుకుంటున్నారు. అలాంటప్పుడు భూమే లేని పేదలకు పెట్టుబడి సాయం పేరుతో డబ్బు ఇవ్వడం తప్పే కాదు అని విశ్లేషకులు చెప్తున్నారు. పైగా, ఉపాధి కార్డు లింక్ చేస్తే కచ్చితమైన కూలీల వివరాలు తెలిసి, అర్హులకు రూ.12 వేలు అందుతాయని పేర్కొంటున్నారు. ఏదేమైనా ఇన్ని రోజులు రైతు కూలీలు, కౌలు రైతులకు పెట్టుబడి సాయం ఎలా ఇస్తారు? అన్న అనుమానాలకు కాంగ్రెస్ తెరదించినట్టే కన్పిస్తోంది. ఈ విషయం భూమి లేని రైతులకు సరిగ్గా అర్థం అయితే, వాళ్ల ఓట్లు కాంగ్రెస్‌కు పడటం మాత్రం పక్కా.

వెబ్ స్టోరీస్