కేసీఆర్‌కు కులాల నిరసన సెగ.. పద్మశాలీలు, ముదిరాజ్‌ల తీవ్ర ఆగ్రహం

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ Photo: Instagram||

ఈవార్తలు, తెలంగాణ న్యూస్: తెలంగాణలో ఎన్నికల కోలాహలం నడుస్తోంది. ఇంకా ఎలక్షన్ షెడ్యూల్ రాకముందే అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అందులో భాగంగా ఒక అడుగు ముందుకేసిన తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏకంగా అభ్యర్థులను కూడా ఇప్పుడే ప్రకటించేశారు. రాష్ట్రంలో మొత్తం 119 నియోజకవర్గాలు ఉండగా, 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి సంచలనం రేపారు. అయితే, కేసీఆర్‌కు పలు వర్గాల నుంచి నిరసన ఎదురవుతోంది. ముఖ్యంగా పద్మశాలీలు, ముదిరాజ్‌లు సీఎం కేసీఆర్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కారణం ఏంటంటే.. 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. ఒక్క ముదిరాజ్‌కు కూడా సీటు ఇవ్వకపోవడమే. పద్మశాలీల్లో ఒకరికి మాత్రమే టికెట్ దక్కింది. దీంతో బీసీలను అణచివేసే కుట్రలో ఇదీ ఒక భాగమేనని, రాష్ట్రంలో అధిక శాతం ఉన్న తమ కమ్యూనిటీలకు ద్రోహం చేశారని మండిపడుతున్నారు.

కేసీఆర్ ప్రకటించిన 115 స్థానాలకు గానూ 58 సీట్లు ఓసీలకే కట్టబెట్టారు. అందులోనూ 40 స్థానాల్లో రెడ్డి అభ్యర్థులే ఉండటం గమనార్హం. ఇక ఎస్సీలు 20, ఎస్టీలు 12 మంది, మైనారిటీలు ముగ్గురు బరిలో ఉన్నారు. వారిలో ఏడుగురు మహిళలు ఉన్నారు. అయితే, రాష్ట్రంలో అత్యధిక వర్గం ఉన్న బీసీలకు 22 సీట్లే కేటాయించడంపై బీసీ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. అందులోనూ కీలక కమ్యూనిటీలు అయిన పద్మశాలీలు, ముదిరాజ్‌లు కేసీఆర్‌పై కోపంతో ఉన్నారు. మొన్నకి మొన్న కోరుట్లలో పద్మశాలీలు జరిపిన సభకు భారీ ఎత్తున తరలివచ్చారు. ఒకవిధంగా ఈ సభను రాజకీయ బలప్రదర్శన అనాలి. ఆ సభలో తమ కులస్థులకే టికెట్ ఇచ్చేలా పార్టీలు నిర్ణయం తీసుకోవాలని తీర్మానం చేశారు. కానీ, కేసీఆర్ మాత్రం ఒక్కరంటే ఒక్కరికే టికెట్ ఇవ్వడం గమనార్హం.

దీంతో ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎట్టిపరిస్థితుల్లోనూ ఓటు వేయొద్దని నిర్ణయించుకుంటున్నారు. గ్రామ, మండల స్థాయిల్లో జరిగే నెలవారీ కుల సంఘాల సమావేశాల్లో కేసీఆర్ వ్యవహారశైలిపై చర్చింటుకుంటున్నారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న తమ కులాలను కేసీఆర్ విస్మరించారని, దీనికి బదులు తీర్చుకోవాలని తీర్మానాలు చేసుకుంటున్నారు. ఈ మేరకు ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా విజ్ఞప్తులు చేయాలని కుల పెద్దలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే, కేసీఆర్ మాత్రం వ్యక్తిగతంగా చూస్తే ఓటు వేసేవారు కులం కన్నా తమవైపే చూస్తారని ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే పెద్ద వర్గాలపై పద్మశాలీలు, ముదిరాజ్‌లకు ప్రాతినిథ్యం కల్పించలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. 

115 అభ్యర్థుల సామాజిక వర్గం ఇలా..

ఓసీ-58, బీసీ-22, ఎస్సీ-20, ఎస్టీ-12, మైనార్టీ-3, మహిళలు-7

ఓసీ 58 మంది

రెడ్డి-40, వెలమ-11, కమ్మ-5, వైశ్య-1, బ్రాహ్మణ-1,

బీసీ 22 మంది 

మున్నూరు కాపు-10, యాదవ్-5, గౌడ-4, బెస్త-1, వంజర-1, పద్మశాలి-1

ఎస్టీ 12 మంది

లంబాడీ-7, ఆదివాసీ-5

ఎస్సీ 20 మంది

మాల-8, మాదిక-11, నేతకాని-1

వెబ్ స్టోరీస్