ఆకలి అని వస్తే కడుపునిండా భోజనం.. హైదరాబాద్ బంజారాహిల్స్ నడిబొడ్డున ఉచితంగా..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||ప్రతీకాత్మక చిత్రం||

ఈవార్తలు, హైదరాబాద్ : అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం లేనిదే ఏ ప్రాణీ జీవించదు. ఆకలితో అలమటించినవారికి బుక్కెడు బువ్వ పెడితే ఆ అన్నార్థి.. అన్నదాత సుఖీభవ అని పెట్టే దీవెనార్తి సకల దేవతలు కురిపించే శుభాశీస్సులతో సమానం. కోటి గోవుల దాన ఫలితంతో సమానం. అన్ని దానాల్లోకెళ్లా అన్నదానం మిన్న అని అంటారు. మనిషికి ఎంత దానం చేసినా, ఇంకా కావాలని కోరుకుంటాడు. కానీ, అన్నదానం చేస్తే కడుపునిండిన తర్వాత ఇక చాలు అని సంతృప్తి చెందుతారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు సైతం ‘‘అన్నాద్భవన్తి భూతాని పర్జన్యా దన్నసంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః ’’ అని అర్జునుడికి బోధించారు. అంటే.. ప్రాణం అన్నం వల్ల, అన్నం మేఘం వల్ల, మేఘం యజ్ఞం వల్ల, యజ్ఞం కర్మ వల్ల జరుగుతుంది అని వివరించారు.

అంతటి గొప్పదనం కలిగిన అన్నదానం.. హైదరాబాద్ నడిబొడ్డున ఉచితంగా అందజేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నదో ఆహారశాల. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రోడ్డు నంబర్ 10 పై, ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి తెలంగాణ భవన్ వైపు వెళ్తుండగా రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన ఆహారశాల వద్ద రెండు కూరలు, మజ్జిక, ఊరగాయతో ఉచితంగా కడుపునిండా అన్నం పెడుతున్నారు. ఉద్యోగులు, చిరు వ్యాపారులు, పని మీద అటుగా వెళ్లినవాళ్లు అక్కడ ఆగి, కాసిన్ని మెతుకులు కడుపులో వేసుకుంటున్నారు. కడుపు నిండా అన్నం తిన్నవాళ్లు.. అక్కడ పనిచేస్తున్న వ్యక్తితో అన్నదాత సుఖీభవ అంటూ కొనియాడుతున్నారు. ఆ ఆహారశాలను ఎవరు నిర్వహిస్తున్నారన్న కచ్చితమైన సమాచారం లేకపోయినా, హరే కృష్ణ ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్నట్లు తెలుస్తోంది.

వెబ్ స్టోరీస్