ఉత్తరం జాడ ఎక్కడ.. మధుర జ్ఞాపకాలకు ఆనవాలెక్కడ?

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||ప్రతీకాత్మక చిత్రం||

గతంలో ఇంటి ఆవరణలో కాకి అరిస్తే చాలు.. చుట్టాలు వస్తారు, ఎక్కడినుంచి అయినా ఉత్తరాలు వస్తాయి అని పోస్ట్ మాన్ వచ్చే టైం కు గేట్లో నిలబడి ఎదురు చూస్తుండేవారం. బంధువుల దగ్గర నుంచి ఉత్తరం వస్తే చాలు నేను ముందు అంటే, నేను ముందు అని, ఇంట్లో వారు చదవడానికి ఉత్సుకత చూపేవారు. అయితే నేటి ఎలక్ట్రానిక్స్ యుగంలో ఫోన్లు ఈ మెయిల్స్ చాటింగులతోనే గడిచిపోతోంది. ఉత్తరాలు రాయడానికి ఎవరికీ ఆసక్తి, తీరిక ఉండటం లేదు. స్నేహితులకు కానీ, బంధువులకు కానీ ఉత్తరాలు రాసి ఎన్నాళ్లో అయ్యింది. ఎవరికి వారు ఎప్పటికప్పుడు ఫోన్ల ద్వారా మాట్లాడుకున్నా కనీసం రెండు, మూడు నెలలకు ఒకసారి అయినా ఉత్తరాలు రాసుకుంటే ఆ అనుభూతే వేరుగా ఉండేది. పోస్ట్ చేసిన ఉత్తరం చేరడానికి కొంచెం లేటు అయినా సరే, అది చేరిన తర్వాత దాన్ని విప్పి చదువుకోవడంలో అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. స్వదస్తూరితో స్వచ్ఛమైన తెలుగు పదాలతో రాసే ఉత్తరం చూసిన వెంటనే ఆత్మీయులను చూసిన భావం ఏర్పడుతుంది. దాన్ని చదువుతూ ఉంటే ఎదురుగా మనిషే ఉండి మాట్లాడుతున్న ఫీలింగ్ కలుగుతుంది. మనసులోని భావనలను ఆత్మీయతను మధురంగా వ్యక్తం చేయడానికి ప్రధాన సాధనం ఉత్తరం. దీని ద్వారా అనేక విషయాలను మరచిపోకుండా ఒకరికొకరు తెలియజేసుకోవచ్చు. ఒకసారి రాసిన ఉత్తరాన్ని ఎంతకాలమైనా మధురమైన జ్ఞాపకం గా దాచుకొని, అప్పుడప్పుడు చదువుకునే వీలుంటుంది.

(ఈవార్తలు, రంగారెడ్డి ప్రతినిధి, అక్కినేపల్లి పురుషోత్తమరావు)

వెబ్ స్టోరీస్