మారిన ట్విట్టర్ లోగో.. పిట్ట ప్లేస్‌లో కుక్క బొమ్మ.. మస్క్‌ మెంటల్ తారాస్థాయికి

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||మారిన ట్విట్టర్ లోగో||

ఈవార్తలు, టెక్ న్యూస్ : ట్విట్టర్‌ను, అందులోని ఉద్యోగులను ఊపిరి తీసుకోకుండా చేస్తున్న ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ మరో తింగరి పని చేశారు. ఏకంగా ట్విట్టర్ లోగోనే మార్చేశారు. ఇప్పటి వరకు ఉన్న లోగో బ్లూ బర్డ్  (Twitter Logo blue bird)ను తొలగించి, దాని స్థానంలో కుక్క బొమ్మను పెట్టించారు. క్రిప్టో కరెన్సీ అయిన డోజీ కాయిన్‌కు సంబంధించిన డోజీ మీమ్‌ను లోగోగా ఉంచారు. మంగళవారం లేచేసరికే ట్విట్టర్ యూజర్లకు కొత్త లోగో దర్శనమిచ్చింది. లోగో మార్పుపై ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. బ్లూ బర్డ్ ఇక పాతదని, ఇకపై డోజీ మీమ్ కొత్త లోగో అని ఓ మీమ్‌ను ట్వీట్ చేశారు. డోజీ మీమ్‌ను ట్విట్టర్ లోగోగా పెట్టాలని ఓ యూజర్ గతంలో అడిగిన స్క్రీన్ షాట్‌ను కూడా దానికి జత చేశారు. అందుకు తాను సానుకూలంగా స్పందించారు. దాంతో అప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని మస్క్ చెప్పడం గమనార్హం. కొత్త లోగో ఎప్పటికీ అలాగే ఉంటుందా? మళ్లీ మార్చుతారా? అన్నదానిపై మస్క్ స్పష్టత ఇవ్వలేదు. 

కొత్త లోగో డోజీ ఏమిటి?

జపాన్‌కు చెందిన షిబా ఇనూ జాతి కుక్క చిత్రాన్ని డోజీగా పిలుస్తున్నారు. 2013లో తొలిసారి డోజీ కాయిన్ క్రిప్టో కరెన్సీకి దాని వెనుక ఉండే బ్లాక్ చైన్ సాంకేతికతకు గుర్తుగా క్రియేట్ చేశారు. అప్పటి నుంచి డోజీ అనే పేరు క్రిప్టో కరెన్సీకి స్థిరపడింది. తొలి నుంచి క్రిప్టో కరెన్సీకి మద్దతుగా నిలుస్తున్న మస్క్.. ఇప్పుడు తన సంస్థ లోగోను డోజీగా మార్చేయడం గమనార్హం. తన ట్విట్టర్ లోగోను డోజీగా మార్చాడో లేదో.. కాయిన్ విలువ భారీ స్థాయిలో 22 శాతం పెరిగింది.

వెబ్ స్టోరీస్